చతుర్విధ శుశ్రూషలు

చతుర్విధ శుశ్రూషలు
దివ్యాత్మ స్వరూపులార! మనిషికి ఉన్న విశేషమైనటువంటిది జ్ఞానమొక్కటే అనేది అందరికీ రూఢీగా తెలిసిన విషయమే. మిగిలినటువంటి ఎనుబదినాలుగు లక్షల జీవరాసులతో పోలిస్తే, ఒక్క వివేకములో మాత్రమే మనిషి అధికుడైయున్నాడు. అయితే ఆ వివేకం విజ్ఞానంగా మారాలి అంటే, తన జీవనాన్ని ఎలా గడపాలి? అనే ప్రాధమికమైనటు వంటి జీవన సత్యాలను గ్రహించవలసిన అవసరం ఉంది. ఎవరి దగ్గర నుంచి గ్రహించాలి? భూమండలము మీదనున్న సమస్త మానవులని అధ్యయనం చేయాలి అంటే, అది ఒక జీవితంలో సాధ్యమయ్యే అవకాశం లేదు. అంత దీర్ఘజీవనం కూడా అవకాశం లేదు. కాని గురువు ఉపదేశం ద్వారా ఒక సాంప్రదాయక విద్యా విధానం ద్వారా విజ్ఞానం మూర్తీభవించినటువంటి సత్ స్వరూపులైనటు వంటి వాళ్ళని ఆశ్రయించటం ద్వారా, గురుకృపా విశేషం చేత, సచ్ఛాస్త్ర శ్రవణం చేత, సద్గురుకృప చేత ఈ విజ్ఞానాన్ని సాధించవచ్చు. అయితే ఆశ్రయించేటటువంటి శిష్యులు గురువుగారికి ఏమి చెయ్యగలుగుతారు? అసలు ఏమి చేస్తే గురు కృప లభిస్తుంది? ఎందుకనంటే ఎంత శాస్త్రం చదివినా సరే, ఒక వంద పుస్తకాలను మనం compile చేసి ఒక పుస్తకంగా వేసినా సరే, అవన్నీ చివర ఒక వాక్యంతో ముగిసిపోతాయి. ‘యథార్థం అనుభవైక వేద్యం’ ‘యథార్థం గురుకృప చేత తెలియవలయును’ ఇలాగ వేదాంతంలో అన్ని స్థితులు అన్ని సాధనలు ఇన్ని మాట్లాడుకున్న అక్కడకు వచ్చి ఆగిపోతుంది. అంటే మనం ఏమి చేస్తే, ఎలా జీవిస్తే ఈ గురుకృపను సాధించగలుగుతాము? గురుకృప లేకుండా విజ్ఞానాన్ని సాధించటం అసాధ్యం. అది స్వీయ ప్రయత్నం ద్వారా సాధింపబడేటటువంటి అంశం కాదు. అందుకే పరంపరానుగతమైనటు వంటి ఉపాసనా విధే బోధించ బడుతుంది. అధ్యయనం చేయబడుతుంది, నిన్న కూడా మనం నాలుగు స్థితులు గురించి మాట్లాడుకున్నాం. గురువుగారు వారి గురువుగారు సద్గురువుగారు వారి గురువుగారు పరమగురువుగారు వారి గురువుగారు పరమేష్ఠిగురువుగారు. అంటే ఎవరి సంప్రదాయాను సారం వాళ్ళు ఈ నాలుగు తరాల గురువులని స్మరిస్తూ ఉంటారు. ఆరాధిస్తూ ఉంటారు. ఆశ్రయిస్తూ ఉంటారు. శిష్యుడు గురువుని ఎలా ఆశ్రయించాలి అసలు? ఎందుకంటే ఆ ఆశ్రయించటంలోనే అసలు రహస్యం అంతా ఇమిడి ఉంది. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు, తల్లిని ఎలా ఆశ్రయించి ఉన్నాడు? అంటే మనకి మొదటి ఆశ్రయం ఎక్కడ మొదలైంది? అంతే కదండీ, తల్లి గర్భంలో తల్లిని ఆశ్రయించి ఉన్నాము. ఆ ఆశ్రయం మనం జన్మించిన తరువాత తల్లిని ఆశ్రయించే విధానం ఈ రెండిటిలో ఏమైనా మార్పు ఉన్నదా? ఒకటేనా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఆశ్రయించిన జీవన విధానానికి, బయటకు వచ్చిన తరువాత తల్లిని ఆశ్రయించటానికి మధ్యన ఏమైనా భేదం ఉన్నదా? భేదం ఉంది, ఉందా! ఏమిటి? తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఎలా ఆశ్రయించాం? బయటకొచ్చినాక  సహజంగా ఆశ్రయించటం లేదా? ఏక కాలంలో తల్లితో కలిసి ఉన్నాడు, కలవకుండా కూడా ఉన్నాడు. బయటకు వచ్చేసినాక మానసికంగా కలిసే ప్రయత్నం చేస్తున్నాడు, భౌతికంగా కలవకుండా ఉంటున్నాడు. మరి జన్మనిచ్చినటువంటి తల్లిని ఆశ్రయించటానికే ఇన్ని రకాల సమస్యలుంటే, మరి సద్గురువుని మనం ఎలా ఆశ్రయించాలి? ఆ ఆశ్రయంలోనే జ్ఞానం ఇమిడి ఉంది. ఆ ఆశ్రయ ఫలితమే గురుకృప అంటే. అందుకని పారంపర్యానుగతంగా చెప్పేటప్పుడు ప్రతి చోట చతుర్విధ శుశ్రూషలకి ప్రాధాన్యత ఇవ్వబడింది. అంగ, స్థాన, భావ & ఆత్మశుశ్రూషలు. ఈ నాలుగు శుశ్రూషా విధానాల ద్వారానే గురువుని ఆశ్రయించటానికి వీలుంది. ఈ నాలుగు సమగ్రమంగా మనకు తెలియక పోయినట్లయితే గురువును ఆశ్రయించాము అనుకోవటం కేవలం ఒక భౌతికమైన ప్రక్రియగా మిగిలిపోతుంది. మరి గురుకృప అంటే భౌతికంగా నిరూపించటానికి వీలుకానిది. తల్లికి బిడ్డ యడల ప్రేమ ఉంటుందా? కరుణ ఉంటుందా? దయ ఉంటుందా? సాన్నిహిత్యం ఉంటుందా? వీటిలో ఏమి ఉంటాయి? ఈ నాలిగింట్లో ఏముంటాయి? నాలుగూ ఉంటాయా? నిజానికి దయ, కరుణ, సాన్నిహిత్యం అనేవి ప్రేమలో అంతర్భాగం. కాని సందర్భానుసారంగా ఒక అంశాన్ని మాత్రమె వ్యక్తీకరించి నప్పుడు, ఆ పరిమితమైనటువంటి స్థితిలో అవి దయ కరుణ సాన్నిహిత్యంగా పిలువబడుతాయి. కాబట్టి తల్లి బిడ్డల యడల ప్రేమనే కలిగియుంది అన్నదానితో ముగిసిపోతుంది. కాని ఆ ప్రేమయొక్క అభివ్యక్తీకరణలోకి వచ్చేప్పటికి ఏమైంది? దయ కరుణ సాన్నిహిత్యం ఇతరత్రా ఆ సమానార్థక మైనటు వంటి పదాలను మనం వినియోగించవలసి వచ్చింది. మరి గురువుని ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు వీటిలో దేనితో మనం ఆశ్రయించాలి? లేదా గురువు గారు మన యెడల ఎలా ప్రతిస్పందించాలి? ఆయన కూడా ప్రేమతోనే స్పందించాలా? దయతో స్పందించాలా? కరుణతో స్పందించాలా? సాన్నిహిత్యంతో స్పందించాలా? ‘కృప’ అంటే ఏమిటి? అనుగ్రహం అంటే, అదే నేను అడుగుతున్నది, మనకు అర్థం అయ్యే భాషలో ఏమిటి? గురు అనుగ్రహం అని గురు కృప అని మనకు శాస్త్రంలో ఉంటుంది. అది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మనం ఎలా తెలుసుకుంటాం అనేదాన్ని బట్టేగా మనకు నిర్ణయం కలిగేది? అంతేనా అండి? ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అంథుడికి తెలుస్తుందా? చూపుద్వారా తెలియదు. స్పర్శ ద్వారా తెలుసుకుంటాడు. అర్థమైందా అండి? కాని మనం సాక్షాత్ సూర్యదర్శనం తెలుసుకో గలుగుతాము. ఎందుకని చూడగలిగే శక్తి ఉంది కాబట్టి. మరి గురువుని గుర్తించాలి కదా అసలు మొట్టమొదట. ఆశ్రయించాలి అంటే ఏమి చెయ్యాలి? గుర్తించాలి. అంతేనా కదా? తల్లిని మనం ఎలా ఆశ్రయించాం? తల్లిని ఆశ్రయిస్తేనే కాదా ఆమె స్థానం ఇచ్చింది గర్భంలో. అంతేనా కాదా? నువ్వు ఆశ్రయించావా? ఆమె నిన్ను ఆహ్వానించిందా? తల్లి జీవులను ఆహ్వానించటం లేదా? అంటే తల్లి గర్భాన్ని ఎంపిక చేసుకోవటం అనేది, నీ చేతుల్లో ఉందా? లేకపోతే ఆ తల్లిదండ్రుల చేతిలో ఉందా? ఎందుకని అంటే, జనన మరణాలు పరస్పరం ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. ఆ ఆశ్రయ లక్షణంలోనే అది ఇమిడి ఉంది. తల్లిదండ్రులకి ఏ సంస్కారబలం ఉందో, ఆ సంస్కార బలానికి వారిద్వారా జన్మించేటటువంటి శిష్యులకి అనుకూలతలు గాని ప్రతికూలతలు గాని ఉన్నాయా? అంతేగా ఉండేది? కాని తల్లిదండ్రులు ఎప్పుడు ఎటువంటి శిశువుకి జన్మనివ్వాలని అనుకుంటారు? అనుకూలమైన శిశువులకే జన్మనివ్వాలని అనుకుంటారు. అంతేనా కాదా? తమ తెలివితేటలని అనుసరించి తాము అనుకున్నవాటిని అనుసరించి పిల్లల్ని అలా పెంచి, వాళ్ళని పెద్దవాళ్ళని చేసి తమ ప్రతిబింబాలుగా పెంచేసి వాళ్ళళ్ళో తమని చూసుకోవటం కోసమని ఆ ఆశయాన్ని నేరవేర్చుకోవటం కోసమని పిల్లల్ని కంటున్నారు. ఇవి తల్లిదండ్రుల్లో ఉండే భావాలు. మరి వచ్చేటటువంటి పిల్లలు ఎలా వస్తున్నారు? ఇవన్నీ సరిపోతున్నాయా? సరిపోవటం లేదా? సరిపోవటం లేదుగా! ఒకసారి అలోచించి చూడండి, కళ్ళుమూసుకుని ఆలోచించుకోండి. మీ పిల్లలు మీ ఆశయాన్ని నెరవేర్చేటట్లుగా మీ ప్రతిబింబాలుగా మీ జ్ఞాన వారసత్వానికి అధికారులుగా అలా ఉండే అవకాశం ఆ పిల్లల్లో ఉందా? ఆ! అన్నీ ఎలా ఉన్నాయండి ఇప్పుడు? అంటే ఆశ్రయంలోనే ఎక్కడో 50 50 గా ఉంది. సాంతం వ్యతిరేకము కాదు, సాంతం అనుకూలముకూడా కాదు. ఈ సాంతం ఒక ప్రక్కగా లేకుండా అసలు సృష్టి ఇలా ఎందుకు నిర్మాణం చేయబడింది? మనకి ఒక్కళ్ళకే కాదుగా almost all మీకు తెలిసినటువంటి ఏ మనుషులనైనా చూడండి. అందరూ ఆయా అనుకూల సంస్కారం గాని, వ్యతిరేక సంస్కారం గాని, ఒకే విషయంలో ఇప్పుడు అనుకూలంగా ఉంటాడు, కాసేపాగితే వ్యతిరేకం అవుతున్నాడు. ఎలా? అంటే మరి మనం ఇన్ని లక్షణాలతో, ఇన్ని వ్యతిరిక్తతలతో ఇంత అనేకత్వంతో ఉన్నటువంటి వాళ్ళం, గురువును ఎలా గుర్తించగలుగుతాం? గురువుని ఎలా ఆశ్రయిస్తాం? మన జననం లోనే ఇంత complexity ఉంది. అవునా కాదా? మరి జనన మరణ రహస్యాన్ని భేదించటానికే గురువు అవసరం. జనన మరణాలనే స్థితిని దాటటానికే గురువు అవసరం. పునరావృత్తి రహితమైన స్థితిని పొందటానికే గురువు అవసరం. మరి ఆ దృష్టి కోణంలో అధ్యయనం చేశామా? మనం గురువు గారిని? అంటే గురువుని ఎవరు అధ్యయనం చెయ్యాలి అసలు? శిష్యులే అధ్యయనం చెయ్యాలి. ఆశ్రయించినటు వంటి శిష్యుడికి గురువులో ఏ లక్షణాలు కనపడాలి ఇప్పుడు? ఈయనను ఆశ్రయించటం ద్వారా, నాకు మూడు ప్రయోజనాలు కలగాలి. జనన మరణ రహస్యం భేదించబడాలి. జననం మీద మరణం ఆధార పడుండా? మరణం మీద జననం ఆధారపడుందా? అసలు నాకీ ఆశ్రయం ఎలా కలుగుతోంది? రెండవ ప్రయోజనం ఏమిటి? అసలు పునరావృత్తి రహితమైన స్థితి అంటూ ఒకటి ఉందా? ఆ ఉన్నదానికి ఏ లక్షణాలున్నాయో ఆ లక్షణాలను ప్రతిబింబించేటటువంటి వాడుగా ఆయన ఉన్నారా? శాస్త్రమేమో శబ్ద ప్రమాణంగా చెప్తోంది. గురువు ప్రత్యక్ష ప్రమాణంగా ఉండాలి. కాబట్టి శాస్త్రం చదివి విశ్వసించటం. అక్కడ నీకు దర్శించేటటువంటి సమర్ధత ఏర్పడదు. అదే ఆయా లక్షణాలు మూర్తీభవించి నటువంటి సత్పురుషుడైన గురువు నీకు ఎప్పుడైతే లభిస్తాడో ప్రత్యక్ష ప్రమాణంగా గురువుని ఆశ్రయించటానికి వీలైంది. ఆ ఆశ్రయించటం ఎట్లా ఆశ్రయించాలయ్యా అంటే, అంగ స్థాన భావ ఆత్మ శుశ్రూషలతో ఆశ్రయించాలి. అంటే ఏమిటండీ?
అంగ శుశ్రూష ఎలా చెయ్యాలి?
అంటే ప్రతిదాంట్లో ఇందాక చెప్పినట్లుగా వాచ్యార్థము లక్ష్యార్థము ఎప్పుడూ ఉంటాయి. మామూలుగా వాచ్యార్థముగా మాట్లాడుకుంటే, గురువు గారికి వారి వారి దైనందిన జీవన కార్యక్రమాలలో వైదిక కార్యక్రమాలలో జ్ఞాన సంబంధమైన కార్యక్రమాలలో బోధా సంబంధమైన కార్యక్రమాలలో జ్ఞానాభిలాషను పూర్తి చేయవలసినటువంటి పనులలో భౌతికమైనటువంటి అవసరాలను సమకూర్చటం. అంటే పూర్వకాలంలో అందరూ కూడా మహర్షులు యజ్ఞాలు యాగాలు చేస్తుండేవారు. ఆయా సమిధలు వగైరాలు. ఇప్పుడు మనమేమి చేద్దాం? ప్రశ్న అలా ఉండిపోయింది, answer రాలేదు, అంటే అంగ శుశ్రూష ఇప్పుడు సాధ్యమౌతుందా? అంటే శాస్త్రంలో మీరు చదివితే ఇదే ఉంటుంది అంగ శుశ్రూష అంటే. అంటే మరి మీరు ఆశ్రయించిన గురువులు ఎవరైనా సరే అలా యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి మీరు సమిధలు చేకూర్చ వలసినటు వంటి పరిస్థితులు అలాంటి అంగ శుశ్రూషకు సరిపడా వీలుందా? మరి ఎలా చేద్దాం? ఒకటి మిగిలిపోయింది ప్రశ్నanswer చేద్దాం తొందరపడి ఏమీ అవసరం లేదు. మిమ్మల్ని ఆలోచింప చేయటమే నా ఉద్దేశ్యం, ఆలోచించ కుండా బుద్ధి పదునెక్కకుండా ఏదీ సాధించ లేరండి. ఊరక చదువుకుంటూ పోయాం. ప్రయోజనం లేదు. ప్రవాహ సదృశంగా అందరూ వెళ్తున్నారు. మనం కూడా గురువు గారి దగ్గరకు వెళ్ళాం. కాళ్ళ మీద పడాలి. పడ్డాం. విభూతి పెట్టించుకోవాలి పెట్టించుకున్నాం. ఆయన కళ్ళల్లోకి చూడ మన్నారు చూశాం. ముసుగు కప్పారు కప్పించు కున్నాం. చెవిలో మంత్రం చెప్పారు చెప్పించుకున్నాం. ఇదంతా భౌతికం. కేవలం ఈ భౌతిక ఆశ్రయమే అంటే, మీరు కూడా మీ తల్లిని ఆశ్రయించింది భౌతిక ఆశ్రయమే అయి ఉండాలి. అప్పుడు మీకు ‘మాతృదేవోభవ’ అయ్యే అవకాశం లేదు. అట్లాగే ఇక్కడ కూడా ‘ఆచార్యదేవోభవ’ అయ్యే అవకాశం లేదు. అంటే దివ్యత్వ లక్షణాలని గనుక మనం గుర్తించ లేకపోయినట్లయితే అక్కడ తల్లి గాని ఇక్కడ ఆచార్యుడు గాని నీకేమి ప్రయోజనం లేదు. ఆ దివ్యత్వ లక్షణాలను నీలో కలిగింప చేసేవి ఏవైతే ఉన్నాయో, అవి చూపెట్టేవి ఏవైతే ఉన్నాయో వాటినే ఈ చతుర్విధ శుశ్రూషలు అని చెప్పారు. ఈ నాలుగు శుశ్రూషలను ఎవరైతే సమర్థంగా సరియైన రీతిలో లక్ష్యశుద్ధితో ఆచరిస్తారో, వాళ్లకి దివ్యత్వం సిద్ధిస్తుంది. ఈ నాలుగు శుశ్రూషలకు ప్రయోజనం ఏమిటయ్యా అంటే, ఆశ్రయించినటువంటి వాడు ఈ శుశ్రూషలు చేసినటువంటి వాడికి దివ్యత్వం సిద్ధిస్తుంది. ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి గురువుని  అంగ శుశ్రూష స్థాన శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూషలనే నాలుగు శుశ్రూషలని త్రికరణ శుద్ధితో (ఇందాక చెప్పిన వాళ్ళు ఆ త్రికరణ శుద్ధి విషయం చెప్పారు.) త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి. మనం ఇప్పుడు ఆశ్రయించేప్పుడు త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తున్నామా? అంటే అర్థం ఏమిటి? మనసా వాచా కర్మణా ఏమిటీ మూడు? ఈ మూడు వల్ల మీ గురువుగారికి ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? మీ మనసు వల్ల ఆయనకేమన్నా ప్రయోజనం ఉందా? మీ వాక్కు వల్ల ఆయనకేమైనా ప్రయోజనం ఉందా? మీ కర్మానుభవం వల్ల ఆయనేకేమన్నా ప్రయోజనం ఉందా? మరి ఈ మూడింటితోనే ఆశ్రయించమంటున్నారు కదా! వేరే మార్గం లేదుగా, నీ దగ్గర ఏమున్నాయి. ఈ మూడే ఉన్నాయి. ఈ మూడిటితోనే ఆ నాలుగు శుశ్రూషలు చెయ్యాలి. వేరే మార్గం లేదు. మనస్సు వాక్కు కర్మ ఈ మూడింటి ద్వారానే ఆ నాలుగు శుశ్రూషలను చేసి తీరాలి. ఇక్కడ ఎక్కడా కూడా శరీరం అన్న శబ్దం ఉందా? లేదు మనసు వాక్కు కర్మ అంటే అర్థం ఏమిటయ్యా? స్థాన శుశ్రూషలో చూస్తే శాస్త్రంలో ఏమని చెప్తోంది? ఎదో గురువుగారు కూర్చునే కుర్చీ బాగు చెయ్యి, ఆయన పడుకునే పడక బాగు చెయ్యి లేకపోతే ఆయన గృహాన్ని బాగు చేసుకోవడంలో ఆయన యొక్క పూజాగదిని శుభ్ర పరచటంలో వాచ్యార్థంగా చెప్పినప్పుడు ఈ రకమైనటు వంటి అర్థాన్ని చెప్పుకోవాలి. మరి అలాంటి పనులు మనం ఎంతమంది చేస్తాం? అది అయ్యే పనేనా? ఆయనకేమన్నాపోనీ ఒక 20 అంతస్తుల భవనం ఉందా? ఇంతమంది తుడవాలా? ఇంతమంది తుడవాలంటే 20 అంతస్తుల భవంతి ఉండాలి. లేదు. మరి ఇలాంటి భౌతిక అర్థంతో చెప్పారా? స్థాన శుశ్రూష అంటే, మరి ఎలా చెయ్యాలి? ఈ స్థాన శుశ్రూషలను దేనితో చెయ్యాలి? ఇందాకే చెప్పా మనసు వాక్కు కర్మతోటే చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి? మూడిటిని ఉపయోగించాలి తప్పదు. ఒక్కటే ఉపయోగిస్తే ఎప్పటికీ పూర్తికాదు. ఇక మూడవదైనటువంటి భావ శుశ్రూష. భావ శుశ్రూష అంటే శాస్త్రంలో ఏమి చెప్తున్నారు. గురువుగారు ఒక మంత్రోపదేశం చేశాడు కదా! ఆ మంత్రార్థం ఎవరు? మంత్రార్థం అతని రూపు. అంటే గురువు ఆ మంత్రం బోధించిన తరువాత ఆ మంత్రం యొక్క వాచ్యార్థ లక్ష్యార్థాలన్నీనీకు తెలియజేసిన తరువాత ఆ మంత్రాన్ని నువ్వు ఉపాసించేటప్పుడు నీకొక ఆలంబన కావాలి. ఆలంబన లేకుండా బుద్ధి నిలబడదు. దానికి ఎవరు దేనిని స్వీకరించాలంట ఇప్పుడు? గురువుగారి రూపాన్నే స్వీకరించాలి, ఎందకని మంత్రార్థం అతనిరూపం. ఈ మంత్రార్థం అతని రూపు అనటంలో ఒక రహస్యం ఇమిడి ఉంది. గురువు ఏ మంత్రమైన నీకు బోధించేటప్పుడు, ఆ మంత్రాన్ని సిద్ధించుకున్నవాడై ఉండాలి. అతను సాధనలో ఉన్నటువంటి, అతను సాధనగా చేస్తున్నటు వంటి మంత్రాలను మీకు బోధించరు. ఏ మంత్రమైతే సిద్ధింప చేసుకున్నారో, ఆ మంత్రాన్నే మీకు ఉపదేశ మంత్రంగా ఇస్తారు. సిద్ధించినప్పుడు ఆమంత్రానికి ఆ గురువుగారికి అభేదమున్నది. కాబట్టి బుద్ధితో మీకు ఆలంబన అవసరమైనప్పుడు ఏం చెయ్యాలట? ఆ భావాన్ని మంత్రార్థం అతని రూపు కాబట్టి గురువుగారి రూపాన్ని భావరూపంలో పట్టుకోవాలి. అలా పట్టుకుని చేసేట్టైతే అది భావ శుశ్రూష అవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఇహ నాల్గవది ఆత్మ శుశ్రూష. ఆత్మ స్థితిలో ఉన్నది ఏకం కదా! మరి శుశ్రూష ఎలా చేస్తావ్? చెయ్యాలంటే ఇద్దరుండాలా వద్దా? చేయించుకునే వాడు, (చేసేవాడు). చెయ్యాలంటే ఇద్దరు ఉండాలా వద్దా? చేయించుకునే వాడు, చేసేవాడు. మరి ఆత్మ శుశ్రూష అన్నప్పుడు ఆత్మ స్థితిలో గురువు శిష్యుడు ఇద్దరున్నారా? లేరందామా? లేరంటే ఆత్మ శుశ్రూష అని శాస్త్రం ఎందుకు చెప్పింది? అంటే శాస్త్ర వాక్యం అసత్యం కాదు. గురువాక్యం అసత్యం కాదు. ఆ రెండూ కూడా సూచిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శాస్త్రం కాని గురువు కాని అనేక వాక్యాలు చెపుతూ ఉంటారు. ఆ వాక్యాలలో సాధన వాక్యాలుంటాయి. సూచన వాక్యాలుంటాయి. అది భౌతికంగా చూస్తే మామూలుగా చూస్తేనేమో అది అసాధ్యం లాగా కనపడుతుంది. కాని అసలు ఉత్తమమైన శుశ్రూష అంటూ ఏదైనా ఉందంటే? అది ఆత్మ శుశ్రూషయే అయి ఉండాలి. అయితే నాలుగు శుశ్రూషలలో తప్పని సరిగా చేయవలసినది ఏదయ్యా అంటే? ఆత్మ శుశ్రూషయే చేసి తీరాలంటా! అంటే అంగ స్థాన భావ శ్రుశ్రూషలు చేసినా చేయకపోయినా నీకు గనుక అర్హత గనక ఉన్నట్లయితే చేయగల సమర్థత గనక ఉన్నట్లయితే నీవు ఆత్మ శ్రుశ్రూషని ఆచరించాలి. యథార్థానికి గురువు ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిని యథాతథంగా నీకందించ గలిగిన శ్రుశ్రూష అంటూ ఏదైనా ఉందంటే అది ఆత్మ శ్రుశ్రూషయే అయియున్నది. కాబట్టి ఈ నాలుగు శ్రుశ్రూషలని శిష్యుడు ఏ స్థాయిలో ఉండి చేస్తున్నాడో గమనిస్తాడు గురువు. గురుశిష్య సాంప్రదాయమంటే ఎంతో లోతైన వ్యవహారం. మామూలుగా మన సంసారమే చాల పెద్ద లోతైనది. అతి అగాధమైనది. దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం, మనసుని అర్థం చేసుకోవటం చాలా కష్టం ఇలా ఏవో మాట్లాడుతూ ఉంటారు. కాని అనేక జన్మార్జితమైనటు వంటి పుణ్యఫలాన్ని లెక్కకడితే తప్ప, అనేక జన్మార్జిత మైనటువంటి సంస్కార అనుబంధాన్ని లెక్కకడితే తప్ప గురు శిష్య సంబంధాన్ని నిర్వచించటం చాలా కష్టం. ఏడు అడుగులు నడిచేసి ఏడు జన్మలుగా నిన్ను ఆశ్రయించేశాను అన్నభావనతో వైవాహిక క్రతువు నిర్వహించబడుతున్నది. ఏడు కాదు ఎన్నో జన్మలనుంచీ, లెక్క కట్టడానికి వీలు లేనన్ని జన్మలనుంచీ నువ్వు నన్ను ఆశ్రయించి ఉన్నావని గీతాచార్యుడు అర్జునునితో అంటున్నాడు. మరి ఇప్పుడు దానికేం చెప్తాం? కాబట్టి అనేక జన్మార్జితమైనటువంటి సంచిత రాశిని పోగొట్టుకోవాలి అంటే, గురుకృప మించి వేరే మార్గం లేదు. మనకి జన్మ ఎక్కడ నుంచి కలుగుతోంది ఇప్పుడు? కర్మ వల్లనే జన్మ కలుగుతున్నది. ఆ కర్మ ప్రభావం వల్లనే మన మనస్సు వాక్కు పని చేస్తున్నాయి. సద్గురువును ఆశ్రయించాను త్రికరణ శుద్ధిగా! అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్లిప్పుడు వాళ్ళ యొక్క కర్మ ప్రేరణని, సద్గురు వాక్యానికి అనుసంధానం చేసి ‘గురువాక్యం మేరకే నేను కర్మ ప్రేరణను స్వీకరిస్తాను’ అనే నియమాన్ని పెట్టుకోవాలి. ఏది తోస్తే అది చేయటం కాదు, నాకిది తోచిందండీ, బానే ఉంది కదండీ, చేయటానికి అనువుగానే ఉంది కదండీ, నాకు లాభమే కదండీ, గురువాక్యాన్ని అనుసరించి ఆ కర్మ ప్రేరణని విచారణ చెయ్యాలి. గురువు ఎక్కడ ఉంటాడు అసలు? భగవంతుడు అంతటా ఎలా ఉన్నాడో, గురువు కూడా సర్వవ్యాపక ధర్మాన్ని కలిగి ఉన్నాడు. ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. మరి సర్వవ్యాపకమైనదాన్ని అన్వేషించాలా? ఎక్కడ వెతుకుతావ్? గురువుని అన్వేషించాలని అంటున్నారా లేదా అండి? నీకు తగిన గురువుని అన్వేషించాలి. ఎందుకని? గురువు నిర్ణయం చెయ్యాలి అంటే, ఎవరు చెయ్యాలి? నేను గురువుని నేను పాఠశాల పెట్టాను మీరందరూ చేరిపోండి అని ఎవరూ చెప్పరు. అలాగ చెప్తారా? చెప్పరు. ఈ గురువుగారు నాకు పనికి వస్తారు అని నువ్వే నిర్ణయం చేసుకోవాలి. పనికోస్తాడో రాడో నువ్వే తేల్చుకోవాలి. పనికొచ్చినంతకాలం ఆశ్రయిస్తావ్. నీకు పనికిరాకపోతే వదిలేస్తావ్. నువ్వు పట్టుకోవటం వల్ల నువ్వు ఆశ్రయించటం వల్ల గురువుగారికి ఏ రకమైనటు వంటి ప్రయోజనం సిద్ధించలేదు. నువ్వు వదిలెయ్యటం వల్ల కూడా గురువుగారికి ఏ రకమైనటు వంటి లోటు రాలేదు. అర్థమైందా అండి?           

మరి నీవు గురువుని ఎలా పట్టుకోగలుగుతావు? ఏదైనా నిర్ణయం ఉందా...? ఎలా మనం గురువుని నిర్ణయం చెయ్యాలి? భగవాన్ రమణులు అందరికి సులభ గ్రాహ్యమైనటువంటి సూత్రాన్ని అందించారు.
నీ ప్రయత్నం లేకుండా  ఏ సాధనతో పని లేకుండా ఏ స్థానంలో అయితే నీ మనస్సు ఆగిపోతుందో, చలన రహితమవుతుందో ఆ స్థానమే గురు స్థానము. అని నిర్ణయం చేసారు.
 నువ్వు ఏమి చేసే పని లేదు. ఏ సాధనాలు చెయ్యక్కరలేదు. ఆ ప్రభావం చేత, ఆ స్థితి ప్రభావం చేత, ఆ స్థాన ప్రభావం చేత నీ మనస్సు తనకుతాను కట్టుబడింది. అదే నీ గురు స్థానం.
ఇలా ఎవరైతే గురువును అన్వేషిస్తున్నారో వాళ్ళు ఈ నాలుగు శుశ్రూషలు చేసే విధానాన్ని ఉత్తమమైనటువంటి విధానంగా స్వీకరిస్తారు. వాళ్ళు సచ్చిష్యులు. ఆ సచ్చిష్యులు అంగ శుశ్రూషని
ఎలా చేస్తారు? గురువు అంటే జ్ఞాన స్వరూపుడు కదా!  గురువుకు జ్ఞానానికి అభిన్నత కదా!!  వేరుగా లేరు. నీలో జ్ఞానం ఎక్కడ వున్నది? నీ హృదయ స్థానంలో వున్నది.
కాబట్టి, గురువు గానీ, ఈశ్వరుడు గానీ, భగవంతుడు గానీ నువ్వు ఏ పేరు అన్న పెట్టుకో.. వాళ్ళు ఎక్కడ వుండే అవకాశం వుంది? హృదయ స్థానంలో. అంతే కదా!
కురుత్యే అర్జున శిష్టతి. కదలకుండా అందరి హృదయాలలో నేనున్నాను. కాబట్టి, అంగ శుశ్రూష చెయ్యాలి అంటే, ఎక్కడ ఉన్నడో తెలియాలా..? వద్దా..? తెలియకుండా ఎట్లా చేస్తారు అసలు?
కాబట్టి, నీ హృదయ స్థానాన్ని నువ్వు correct గా పట్టుకోవాలి. గుర్తించాలి. గుర్తించామండి. అక్కడ ఇప్పుడు ఎవరిని ప్రతిష్టించాలి? సిష్తతి ఉన్నాడుగా, గురువుగారు  ఉన్నారుగా జ్ఞానస్వరూపుడుగా.
మరి ఇప్పుడు ఆయనకీ అంగ శుశ్రూష ఎలా చేస్తావు? నీ దగ్గర ఏమి వున్నాయి? మనస్సు, వాక్కు, కర్మ. ఈ మూడిటితోనే చెయ్యాలి. ఈ మూడిటితోటి అంగ శుశ్రూష చెయ్యటం అంటే?
నీ శరీరాన్ని ఇప్పటి వరకు ఎలా వాడుతూ వచ్చావు? భోగ్య వస్తువు వైపు, భోగ దృష్టితో ప్రపంచము వైపుకు త్రిప్పి వాడావు. ఇప్పుడు నీ హృదయ స్థానంలో ఉన్నటువంటి గురువుని
గుర్తించిన తర్వాత, ఇదే శరీరాన్ని యోగ దృష్టితోనే వినియోగిస్తాను అనే నియమం పెట్టుకోవాలి. అంటే, యోగమంటే ఏమిటి? వున్న స్థితి నుంచి వున్నత స్థితిలోకి కలియుట.
లేదు, సమత్వ స్థితిని పొందుట. ఇప్పుడు హృదయ స్థానంలో వున్నా గురువును ఆశ్రయిస్తే నీకు కలిగే జ్ఞానం వల్ల నీకు వచ్చే మొదటి ప్రయోజనం ఏమిటి? ఈ యోగ శక్తి కలుగుతుంది.
అర్థం అయ్యిందా అండి. ఏ సాధన అయినా చెయ్యటానికి కావలసినటువంటి సమర్ధత నీ హృదయ స్థానంలో ఉన్నటువంటి గురువును పట్టుకొనే ప్రయత్నంలో సాధ్యమవుతుంది.
అన్ని సాధనాలు అక్కడికే దారి తీస్తాయి. కాబట్టి, అతనికి శరీరాన్ని వినియోగించటానికి ఎప్పటికప్పుడు విషయ భోగ దృష్టిపోయి యోగ దృష్టి అలవడుతుంది.
అదెలా సాధ్యం అంటే ఈ అంగ శుశ్రూష వల్ల. ఆ నియమాన్ని పెట్టుకున్నాడు ఇక. నేను ఇక శరీరాన్ని విషయ భోగ దృష్టితో విషయాసక్తమైనటువంటి దృష్టితో ఇంద్రియాలను వినియోగించను.
ఈ నియమాన్ని స్వీకరిస్తాడు. ఇలా నియమాన్ని స్వీకరించి శరీరాన్ని ఎప్పుడయితే వినియోగించటం మొదలు పెట్టావో నీవు ఆ అంగ శుశ్రూషను చేసినవాడవు అవుతావు.

రెండవది ఏమిటి? స్థాన శుశ్రూష. సదా నీవు హృదయ స్థానంలోనే నిలబని నీమనస్సుని, నీవాక్కుని , నీకర్మనీ వినియోగించటం కనక నేర్చుకొన్నట్లయితే అప్పుడు నువ్వు స్థాన శుశ్రూషను
చేసిన వాడవు అవుతావు. ఎప్పుడు నువ్వు ఎక్కడనుంచి బయటకు రాకూడదు? నీ హృదయ స్థానం నుంచి. హృదయ స్థానంలో ఎవరు వున్నారు? గురువు గారు హృదయంలో నువ్వు వున్నవా..?
నీ హృదయం లో గురువు గారును పెట్టావా...? అంటే, ఎలా.. ? ఈ మెలికను ఎలా విప్పుదాము? ఇది కూడా వుంది శాస్త్రం వాక్యంలో. అంటే గురువు యొక్క హృదయాన్ని ఎరిగి ప్రవర్తించుట.
అర్థం అయ్యిందా అండి? స్తూలంగా అనుకరించకుండా. నాకు తెలియదు అది అంతా..నువ్వు స్థూలం అనుకొంటావో..సూక్ష్మం అనుకొంటావో ..? అంటే నీవు నీ హృదయ స్థానంలో వుంటే తప్ప గురువు హృదయాన్ని ఎరగలేవు,
తెలుసుకోలేవు. గురువు ఎప్పుడూ నీ గురించి ఏమి అనుకొంటూ ఉంటాడు..? ఆయనకు వేరే పని ఏమి లేదా..? నీ గురించి అనుకోవటం తప్ప.  వాస్తవానికి, నిజ గురువులు, పరమ గురువులు,
పరమేష్టి గురువులు వాళ్ళు అందరూ కూడా అంటే మైత్రేయ మహర్షి, జ్వాలాపూర్ మహర్షి ఇలాంటి మహర్షులు ఎంతో మంది వున్నారు అశరీరులై భారతావని యందు సంచరించేటటువంటి మహర్షులు
అనేకమంది వున్నారు. వీళ్ళందరి దైవీ ప్రణాళిక, దివ్య ప్రణాళిక. గురువు అంటే బాగా గుర్తు పెట్టుకోండి. ఆయనకు వున్నది ఒక్కటే ప్రణాళిక, దైవీ ప్రణాళిక. ఆ దైవీ ప్రణాళిక అనుసారమే ఆయన యొక్క
జీవనం వుంటుంది. వాళ్ళే గురువులు. ఆ దివ్య ప్రణాళికలో మనం అందరమూ భాగమే. కాబట్టి, గురువు హృదయంలో మన అందరికి స్థానం ఉందా..లేదా..? ఎప్పుడు వుంది? ఆయన దైవీ ప్రణాళికను
అనుసరిస్తూ జీవిస్తున్నాడు కదా, ఆయన్ను అనుసరించిన మనం ఆ దైవీ ప్రణాళికను అనుసరించి ఆయన ఎలా జీవిస్తున్నాడో ఆయన జీవనాన్ని చూసి గ్రహించాలి. అర్థం అయ్యిందా అండి. కాబట్టి,
మహనీయులు అయినటువంటి గురువులు కూర్చోబెట్టి ఏమి బోధించరు. మమ్మల్ని చూసి నేర్చుకోవయ్యా అన్నారు. మమ్మల్ని చూసి నేర్చుకోవయ్యా అంటే, అక్కడేమి బోధించటానికి వీలు కాదు.
నీవు ఆయనను బాగా గమనించి, గుర్తించి ఆయన ఆ దివ్యమైన లక్షణాలతో, దైవీ ప్రణాళికతో ఎట్లా జీవిస్తున్నాడో గుర్తించి మాత్రమె నీవు అనుసరించగలుగుతావు. అంటే, ఇప్పుడు నీలో కూడా ఏ
లక్షణాలు వుండాలి? అంటే నీ హృదయం దివ్యత్వంతో నింపటం ఆరంభించాలి. రామకృష్ణులు ఏమంటారు అంటే, విషయ రసంతో నిండినటువంటి జీవనాన్ని దివ్యత్వంతో నింపాలి.
అలా నింపకపోయినట్లయితే నీవు ఎప్పటికీ దైవాన్ని తెలుసుకోనలేవు. కాబట్టి, మనస్సుని, వాక్కుని, కర్మని ఇప్పుడు ఏ ప్రణాలికని అనుసరించి వినియోగించాలి? దైవీ ప్రణాళికకు అనుసంధానం చెయ్యటం
నేర్చుకోవాలి. ఇది గురువుని అనుసరించి తెలుసుకొనవలసిన అంశం. ఇది గురువుని అనుసరించి చేయవలసిన స్థాన శుశ్రూష. ఆయన జీవనాన్ని అధ్యయనం చెయ్యాలి.
ఆయన జీవనం తెరచిన పుస్తకమే అయ్యివుండాలి. రహస్యాలు లేనటువంటి జీవనమై వుండాలి. దైవీ ప్రణాళికను వ్యక్తం చేసేటటువంటి దివ్య జీవనం అయ్యి వుండాలి.
అటువంటి దివ్యజీవన్నాన్ని నీవు అధ్యయనం చెయ్యాలి. ఆయనను అనుసరించి అధ్యయనం చెయ్యాలి. తద్వారా, నీలో ఆ దివ్యలక్షణాల యొక్క బీజాలు పడతాయి.
ఆ స్పురణ కలుగుతుంది. ఈ పరిస్తితిలో ఆయన వుండి ఉన్నట్లయితే ఎలా ప్రతిస్పందిచేవాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించేవారు. అనే స్పురణ కలగగానే నీలో ఆ దైవీ లక్షణాలు మేల్కొంటాయి.
నీ హృదయ స్థానంలో నిలబడివుండి గురువు హృదయాన్ని ఎరిగేటటువంటి, గురువు హృదయంలో ఏముంది? దైవీ ప్రణాళిక వుంది. దివ్య ప్రణాళికను తెలుసుకోవాలంటే వేరే మార్గం లేదు.
గురువు హృదయాన్ని నీవు అనుసరించాలి. ఆ దైవీ ప్రణాళికను అనుసరించాలి. దివ్యత్వానికి సంబంధించినటువంటి బాధ్యతను స్వీకరించాలి. మనమందరమూ ఇప్పుడ ఏ బాధ్యతను స్వీకరించాము?
శారీరకమైనటువంటి, కర్మానుగతమైనటువంటి, జననమరణ సంబంధమైనటువంటి, పునరావృత్తి సహితమైనటువంటి, సంసారచక్ర భ్రమణానికి సంబంధించి, ఇంకా రకరకాలు .. అనేకంగా చెప్పవచ్చు.
ఇలాంటి బాధ్యతలు అన్నే మనం స్వీకరించి చేస్తున్నామా..లేదా..? కానీ, అనంతంగా ఉన్నటువంటి సృష్టి చక్రాన్ని నడుపుతున్నటువంటి ప్రణాళిక ఏమిటి?
దైవీ ప్రణాళిక. అటువంటి దైవీ ప్రణాళికను కదా మనము అసలు ఆశ్రయించవలసింది. మనకి భగవంతుడు మనో వాక్కు కర్మలను ఎందుకు ఇచ్చాడు? మనో వాక్కాయములని క్రిందకు దిగవద్దు.
మనో వాక్కర్మలు అని పైకి చూడండి. మనస్సు, వాక్కు, కర్మని దైవీ ప్రణాళికకు అనుసంధానం చేయటమే స్థాన శుశ్రూష.

ఇక భావ శుశ్రూష అంటే?
ఎప్పుడయితే నువ్వు దైవీ ప్రణాళికకు అనుసంధానపడి నీ జీవనాన్ని జీవిస్తూ ఉన్నవో నీ లోపల ఏ లక్షణాలు అభ్యాసం అవుతున్నాయి? దైవీ లక్షణాలు అన్నీ కూడా. అంటే, దైవాసుర సంపత్తి విభాగ యోగంలో
దైవీ లక్షణాల గురించి స్పష్టంగా చెప్పారు. ఆ దైవీ లక్షణాలతోనే నీ జీవనం జరుగుతుంది. నీవు సదా ఆ దైవీ లక్షణాలనే ప్రకటిస్తూ వుంటావు. నీ జీవన లక్ష్యాన్ని స్పస్టమైనటువంటి మార్గ దర్శకత్వంతో,
స్పష్టమైనటువంటి ప్రణాళికతో, స్పష్టమైనటువంటి సాధనతో, స్పష్టమైన ఆశ్రయంతో నడుపుతావు. ఈ నడిపేటప్పుడు గురువు హృదయాన్ని నీవు ఎప్పుడయితే తెలుసుకోగలిగావో భౌతికంగా గురువుగారి దగ్గరకు
వెల్లెటటువంటి అవసరాన్ని కోల్పోతావు. తలచినంత మాత్రమునే గురు సత్తాని పూర్తిగా గ్రహించగలిగేటటువంటి శక్తి వస్తుంది. అంటే, మనలో స్పూర్తి, ఇంకా కొద్దిగా పై స్థాయికి వెళ్లి చూస్తే ఆదేశం.
గురువు గారి ఆదేశం నీకు తెలుస్తుంది. నిన్ను మార్చటానికి, నిన్ను కడతేర్చటానికి అన్ని శక్తులని ఒడ్డగలిగేటటువంటి సమర్ధత కలిగినవాడు, గురుపాదుకాస్తవాన్ని గనక మనం గమనిస్తే సర్వ జీవులు తన పాదాన్ని ఆశ్రయించి
ఉండునని అర్థం అక్కడ గోచరిస్తుంది. తనకున్నటువంటి అనంతమైనటువంటి దైవీశక్తులని శిష్యుని యొక్క ఉద్ధరణ కొరకు వాడేటటువంటి వారు ఎవరో వారు గురువు. అలా, గురువు గారి యొక్క దైవీ సంపన్నని,
ఆయనలో ఉన్నటువంటి దైవీ సంపదను ఆశ్రయించి
నీలో ఉన్నటువంటి అనేక జన్మార్జితమైనటువంటి వాసనా బలాన్ని, సంస్కార బలాన్ని, గుణ బలాన్ని ఇతరిత్రా రకరకాలైనటువంటి తమో గుణ సాధనలు, రాజసిక సాధనలు , సాత్విక సాధనలు గత జన్మలలో చేయడం ద్వారా బలపడిపోయినటువంటి
మాంత్రికులు, యాంత్రికులు, తంత్రగాళ్ళు, భక్తులు ... చాలా మంది వుంటారు మనలోపల. ఒక పరిధి దాటిన తరువాత మాత్రమె వాళ్ళు అందరు కనబడతారు. సూక్ష్మ శరీర పరిధిలో ఉన్నటువంటి సమస్తమూ కూడా గురువు లో
ఉన్నటువంటి దైవీ సంపద యొక్క సహాయం వల్లనే నువ్వు అధిగమించగలవు. నీ సూక్ష్మ శరీరాన్ని నీవు అధిగమించలేవు. దాన్ని రద్దు చేసుకోలేవు. సూక్ష్మ శరీరాన్ని రద్దు చేసుకోవటానికి కావలసినటువంటి సహాయం గురువు యొక్క ప్రత్యక్ష సహాయం
ద్వారా సాధ్యం. అది ఆయన యొక్క దైవీ శక్తిని వినియోగించటం ద్వారా నిన్ను సమర్ధవంతుడిని చేస్తాడు. నీ తరపున ఆయన పోరాడతాడు. కాబట్టి గురు కృప అంటే, ఆయన యొక్క అనంతంగా ఉన్నటువంటి దైవీ శక్తిని, ఆ దైవీ సంపత్తిని
వినియోగించుకోగలిగేటటువంటి భావ శుశ్రూషని చేయాలి. ఇందాక మీరు అందరు చెప్పేటప్పుడు ఆర్తి అని ఒకటి వాడారు. ఈ అర్తియే ఈ భావ శుశ్రూష. గురువును కదిలించి ఆయనలో ఉన్నటువంటి సంకల్ప శక్తిని కదిలించి ఆయలో ఉన్నటువంటి
దైవీశక్తిని వినియోగించటానికి ప్రేరేపించగలిగేటటువంటి సమర్ధత ఆ ఆర్తిలో వుంది. ఈ ఆర్తి అనే లక్షణాన్నే గనక శిష్యుడు కలిగి లేకపోతె ఎప్పటికి సూక్ష్మ శరీరాన్ని దాటలేడు. ఈ ఆర్తి అనే ఆశ్రయమే భావ శుశ్రూష.

ఇక నాలుగవది అయినటువంటి ఆత్మ శుశ్రూష. ఈ ఆత్మ శుశ్రూష జ్ఞానంతో కూడుకొనివుంది. అంటే, గురువు గారితో నీకు జ్ఞానపరమైనటువంటి రుణానుబంధం వుండితీరాలి. ఇంతకు ముందువరకు, మూడు శుశ్రూషలు చెప్పినప్పుడు వాటిల్లో
ఎక్కడ జ్ఞానపరమైన రుణానుబంధం గురించి మనం మాట్లాడలేదు. గురువు గారికి జ్ఞానపరమైన రుణం ఒక్కటే ఉంటుంది. కర్మ సంబంధమైనటువంటి రుణం లేదు. మరి జ్ఞాన సంబంధమైనటువంటి రుణాన్ని తీర్చటానికి
ఎవరు ఉపయోగ పడతారయ్యా? ఈ ఆత్మ శుశ్రూష చేసేటటువంటి సచ్చిష్యులే ఆ జ్ఞాన పరమైనటువంటి రుణాన్ని తీర్చుకోవటానికి ఉపయోగపడతారు. సదా.. అంటే, మూడవస్తలలోను అంటే తురీయానుభవంతో, ఆత్మ శుశ్రూష చెయ్యాలంటే మనం ఏ
స్థితిలో వుండాలి? తురీయానుభవంలో వుండాలి. ఆత్మానుభవంలో వుండాలి. ఆ తురీయానుభవస్థితిలో గురువుని అశరీర పద్దతిగా ఆశ్రయించాము. దేని కొరకు? 'జ్ఞానాని దగ్ధ కర్మాణాం' అని నిన్న కూడా ఒకరు ఎవరో అన్నారు.
ఈ జ్ఞాన్నగ్నిని పొందాలి అంటే ఈ ఆత్మ శుశ్రూష పనికి వస్తుంది. జ్ఞానాగ్ని లభించాలి అంటే ఆత్మ శుశ్రూషను మించినటువంటి ఆశ్రయం లేదు. ఈ జ్ఞానాగ్ని అనుభవంలో ఆ స్థితిలో నీ సంచిత కర్మరాశి దగ్ధం అవుతుంది.
సంచిత కర్మ రాశి ఉన్నంతవరకు సమిష్టి కారణమయిన మహా కారణస్థితి ఎప్పటికి వుంటుంది. మహా కారణస్థితి ఉన్నంతవరకు వ్యష్టి కారణస్థితి ఎప్పుడూ ఉంటుంది. వ్యష్టి కారణస్థితి ఉన్నంత వరకు సూక్ష్మశరీరం మరలా మరలా పుడుతూనే వుంటుంది.
సూక్ష్మ శరీరం మరల పుడుతున్నంత వరకు జననమరణాలు తప్పవు. మరి నీ లక్ష్యమైనటువంటి జననమరణాలని దాటాలి జననమరణ రాహిత్య స్థితిని పొందాలి, పునారావృత్తి రహితమైనటువంటి శాశ్వత స్థితిని పొందాలి అనే ప్రయోజనాన్ని సాధించాలి అంటే
ఆత్మా శుశ్రూషయే ఉత్తమమైనటువంటిది. అంటే, ఆత్మనుభావం పొందినటువంటి సాధకులు, సచ్చిష్యులు జ్ఞానాగ్నిని గురువుగారి ద్వారా అందుకొన్న వారై, అది గురు కృప అంటే. ఆ జ్ఞానాగ్ని అనేటటువంటి స్థితిని నీచేత అనుభవింపచేయించినప్పుడు
ఆ జ్ఞాన్నగ్నిలో సంచిత కర్మరాశి పోవాలి. మహా కారణస్థితి దగ్ధమైపోవటాన్ని మనం గమనించాలి. మహా కారణ స్థితి యొక్క లేమిని గమనించగలవు. ఏ మహాదహంకారం చేతఅయితే, ఏ కూటస్థుడి చేతఅయితే బ్రంహాన్దములు పిండాన్దములు
వర్తిస్తున్నాయో ఆ కూటస్థుని యొక్క లేమిని స్థితిని తెలుసుకోవటానికి పనికి వచ్చేదే ఈ ఆత్మశుశ్రూష. అంతటి మహత్తర ప్రయోజనాన్ని కలిగి ఉన్నటువంటి శుశ్రూష ఆత్మ శుశ్రూష. కాబట్టి, మోక్షము అన్న పదాన్ని తేలికగా తీసుకోవటం అది
ఎదో రెప్పపాటులోనోఒక గంటలోనో, ఒక కచేరీతోనో, ఒక పాటతోనో వచ్చేసేటటువంటి అంశాలు కావు. ఆజీవన పర్యంతము ఒక సారి దైవీప్రణాళికకి కట్టుబడితే నీ స్వేచ్చను నీవు బానిసవలే కోల్పోయావు. అర్థం అయ్యిందా అండి?
ఈ శుశ్రూషలకు ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళు  ఎవరికి బానిసలట ఇప్పుడు? దైవీప్రణాళికకి బానిసలు. వాళ్ళ వ్యక్తీగత స్వేచ్చ వాళ్లకి లేదు. వ్యక్తులుగా వాళ్ళు లేరు. వాళ్ళ జీవనమంతా కూడా దైవీ ప్రణాళికను నడిపేటటువంటి మహీపీథంలో
ఉన్నటువంటి మహర్షుల ఆదేశానుసారం, మహర్షుల యొక్క కృపారసం చేతనడపబడుతుంది. వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి జీవనానికి ఏమి చేస్తారండి? వాళ్ళకి ఏ ఆలోచనా వుండదు. ఏ ప్రణాళికా వుండదు.
వాళ్ళకే ప్రయత్నం వుండదు. వాటి అంతట అవే ఒనగూడతాయి. ఒనగూడకపోయిన ఆయనకి ఏ రకమైనటువంటి చలనము లేదు. అలా దివ్యత్వానికి బానిసగా జీవించేటటువంటి లక్షణాన్ని మనమీ చతుర్విధ శుశ్రూషల ద్వారా పొందాలి.
అప్పుడు నీవు ఆ దైవీస్థితికి అభిన్నంగా ఉంటావు. నీకు దైవానికి బేధం లేదు అప్పుడు.  అప్పుడు మాత్రమె నువ్వు ఆ జననమరణ రాహిత్య స్థితిని గూర్చి ఆశ్రయించటానికి వీలు అవుతుంది. కాబట్టి, చతుర్విధ శుశ్రూషలని అత్యుత్తమంగా, సచ్చిష్యులుగా
సద్గురువుకు ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ సద్గురుకృపని మీరు పొందగలుగుతారు. అప్పుడు మోక్షమనే జన్మరాహిత్యం తధ్యం. అటువంటి స్థితిని మీరు అందరూ అందుకోవాలని ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు
మీ అందరికి ధన్యవాదములు.
జై గురుదేవ్ !!!